రాష్ట్రంలో జగన్ వ్యవహారం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే సమాజం ఎలా ఉంటుందో ఫామ్ 7 దాఖలుతో తేలిపోయిందన్నారు.
మోడీ, కేసీఆర్ డైరెక్షన్ లో ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టి కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే తొలగించేందుకు ప్రయత్నం చేసిన జగన్ అధికారంలోకి వస్తే ఆస్తులను ఉండనిస్తాడా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. కేసుల్లో ఇరుక్కొన్న జగన్ మోడిని చూసి భయపడతాడేమో కానీ, చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏంటని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ కి రాకుండా పారిపోయి ప్రజాయాత్ర చేస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అనుభవం లేని, అమలు కానీ హామీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరని అన్నారు. 150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.