గురువారం మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డేటా చోరీతో పాటూ తాజా పరిణామాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా సమాచారం కొట్టేసి మా మీదే కేసులు పెడతారా?. మా రాష్ట్రంలో డేటా సేకరిస్తే మీకేంటి సంబంధం. ప్రజల సమాచారం దుర్వినియోగం జరిగిందంటూ నాపై బురదజల్లి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.
ఈ వ్యవహారంతో కేసీఆర్కు ఏం సంబంధం. మీకు అధికారం ఉందని అహంకారమా?. మా సమాచారాన్నే మీరు దొంగలించి.. మమ్మల్నే బెదిరిస్తారా. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? డోంట్ మైన్.. కేంద్రం దాడులకు భయపడేది లేదు. ఏదైనా ప్రశ్నిస్తే ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తూ టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.
జగన్ హైదరాబాద్లో ఉండి కుట్రలు చేస్తున్నారు.. వారికి టీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు చంద్రబాబు. వైసీపీ తరపు నుంచి పోటీచేయకపోతే ఈడీ, ఐటీలతో దాడి చేయిస్తామని టీడీపీ నేతల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు డేటా చోరీ చేసి కొత్త కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ సమాచారం దొంగిలించి.. తిరిగి తమపై అబాండాలు వేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల వ్యక్తిగత సమాచారం తమ దగ్గరుందని.. వారందరికీ బీమా కల్పిస్తున్నామన్నారు. డేటా దొంగింలించి.. ఫారం-7తో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును సరిచూసుకోవాలన్నారు చంద్రబాబు.