దేవుడి కోసం గుడికి వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారికి బడిత పూజ చేశారు స్థానికులు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…వివరాల్లోకి వెళ్తే…
ప్రకాష్ నగర్లోని హరిహర క్షేత్రం పక్కన అమ్మవారి దేవాలయం ఉంది. ఆ ప్రాంతంలోని మహిళలు ఈ గుడికి ఎక్కువగా వెళ్తుంటారు. ప్రతి శుక్రవారం పూజలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. గత శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈ గుడికి వెళ్లి హోమ గుండం వద్ద కూర్చున్నారు. కాసేపటికి అర్చకుడు కుప్పం బాలాజీ వారి దగ్గరకు వెళ్లాడు. మంత్రోపదేశం చేస్తానని చెప్పి చెల్లిని ఆలయం పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక.. నుదుటన బొట్టు పెట్టి, నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పూజారి వెంట వెళ్లిన తన సోదరి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్క అక్కడకు వెళ్లి గది తలుపు తీసింది. పూజారి చేస్తున్న పని చూసి షాకైంది. అక్కడి నుంచి వెంటనే చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసింది. ఆలయంలో జరిగిన విషయం ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు తెలిసింది. వారితో పాటు చుట్టుపక్కల వారు వెళ్లి ఆలయంలో పూజారికి భక్తుల సమక్షంలోనే బడిత పూజ చేశారు. అనంతరం పోలీసుకు అప్పగించారు. ఈ పూజారిపై ఇంతకుముందు ఈ తరహా ఆరోపణలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.